Wednesday, 11 October 2017

జూలై 2017 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్‌ను ఎదుర్కొనేందుకే అణ్యాయుధాలు : పాక్అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ వెల్లడించారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. సెప్టెంబర్ 21న జరిగిన ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్‌‌స భేటీలో మాట్లాడారు. భారత కోల్డ్‌స్టార్ట్ సిద్ధాంతాన్ని(cold start doctrine) ఎదుర్కొనేందుకే ఈ అణ్వాయుధాలను రూపొందించామని వెల్లడించారు. 
పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం. 

ఐరాస వేదికగా పాక్‌పై భారత్ మండిపాటు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టైస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎల్‌వోసీని దాటివస్తే భారత్‌కు దీటుగా సమాధానమిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది. 

భద్రత కౌన్సిల్‌లో భారత సభ్యత్వానికి భూటాన్ మద్దతుఐక్యరాజ్య సమితి భద్రత కౌన్సిల్‌లో జీ - 4 దేశాలకు (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) శాశ్వత సభ్యత్వానికి భూటాన్ మద్దతు తెలిపింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్‌గే ఈ మేరకు జీ - 4 దేశాలకు శాశ్వత సభ్య కల్పించాలని కోరారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలోను సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. 
పోర్చుగీస్ ప్రధాని ఆంటోని లూయిస్ డా కోస్టా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం: భారత్ అఫ్గానిస్థాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్ అభివృద్ధికి సంబంధించి సహాయం కొనసాగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, జేమ్స్ మాటిస్ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ సాయంపై చర్చలు జరిగాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాటిస్ చర్చించారు. 


భారత్ - జపాన్ మధ్య 15 ఒప్పందాలుభారత్ - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 14న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌర అణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.

‘రక్షణ’ సహకారానికిభారత్, జపాన్ నిర్ణయంరక్షణ రంగంలో మరింత సహకరించుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 6న జపాన్ పర్యటనలో ఆ దేశ రక్షణ మంత్రి ఇస్తునోరీ ఒనెడేరాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. జపాన్ నౌకా స్థావరంలోని పి-1 హెలికాప్టర్ నమూనాను పరిశీలించారు. జలాంతర్గాములను ధ్వంసం చేసే ఆయుధ సంపత్తి ఉండటం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధ విధానంలో శిక్షణ ఇవ్వడం పైనా అవగాహన కుదిరింది. రోబోటిక్స్, మానవ రహిత వాహనాలపై సాంకేతిక చర్చలు జరపాలని; నీటిలో, గాలిలో తిరిగే యూఎస్-2ఐ ఉభయచర విమానాల కొనుగోలుపై చర్చించాలని నిర్ణయించాయి.

భారత్, శ్రీలంక నౌకాదళ విన్యాసాలుభారత్, శ్రీలంక సంయుక్త నౌకాదళ విన్యాసాలు సెప్టెంబర్ 7న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఐదో విడత సంయుక్త విన్యాసాలను రెండు పర్యాయాలుగా జరుపుతారు. మొదటి పర్యాయం సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు, రెండో పర్యాయం సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహిస్తారు.

భారత్-బెలారస్ మధ్య 10 ఒప్పందాలు భారత్ పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకోవడంతో పాటు ‘మేకిన్ ఇండియా’ కింద ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని భారత్, బెలారస్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు చమురు, వ్యవసాయం, సైన్‌‌స అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. 


భారత్, మయన్మార్ మధ్య 11 ఒప్పందాలు 
భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 6న ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం.. 11 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సముద్ర రవాణా, మయన్మార్‌లో ప్రభుత్వ సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాలతో పాటు, ఇరు దేశాల ఎన్నికల సంఘాలు, ప్రెస్ కౌన్సిల్స్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మయన్మార్ మహిళా పోలీసులకు శిక్షణపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. 
మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో పర్యటించాలనుకునే మయన్మార్ పౌరులకు ఎలాంటి రుసుం లేకుండా వీసాల జారీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 
సూచీకి ప్రత్యేక కానుక..సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీ(ఐఐఏఎస్)లో ఫెలోషిప్ కోసం 1986లో సూచీ సమర్పించిన పరిశోధన పత్రాల అసలు కాపీల్ని ప్రధాని మోదీ సూచీకి బహుమతిగా ఇచ్చారు. సూచీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 

అఫ్గాన్‌లో 116 ప్రాజెక్టులు చేపట్టేందుకు భారత్ సంసిద్ధత వ్యూహాత్మక భాగస్వామి అయిన అఫ్గానిస్తాన్ భద్రతా వ్యవస్థ పటిష్టతకు మరింత సహకారం అందిస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనేందుకు విసృ్తత స్థాయిలో కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో అఫ్గాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ సెప్టెంబర్ 11న భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అఫ్గాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు అక్కడ కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సుష్మా ఈ సందర్భంగా వెల్లడించారు. 






జూన్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

‘ఛాగోస్’పై మారిషస్‌కు భారత్ మద్దతుఛాగోస్ ఆర్చిపెలాగో ద్వీపంపై మారిషస్-బ్రిటన్ మధ్య ఏర్పడిన వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. దీనిపై ఐరాస సర్వప్రతినిధుల సభలో జూన్ 22న ప్రవేశపెట్టిన తీర్మానం 94-15 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

యూన్ ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌కు మళ్లీ ఎన్నికైన భారత్ ఐరాస ఆధ్వర్యంలోని ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ECOSOC)కు భారత్ మళ్లీ ఎన్నికైంది. ఈ మేరకు జూన్ 15న జరిగిన ఓటింగ్‌లో భారత్‌కు 183 ఓట్లు వచ్చాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్ తర్వాత భారత్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో భారత్‌తో కలిపి మొత్తం 18 దేశాలు ఎన్నికయ్యాయి. 

భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు మూడు దేశాల(పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్)పర్యటనలో భాగంగా జూన్ 24న పోర్చుగల్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతో పాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపేందుకు 4 మిలియన్ యూరోల (దాదాపు రూ.28.8 కోట్లు)తో సంయుక్త నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు. 
 

ఉగ్రవాదంపై అమెరికా-భారత్ సంయుక్త పోరాటం అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జూన్ 26న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేయటంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. 
ఉగ్రవాదంపై పోరులో..ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఘటనలో దోషులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటాన్ని మానుకోవాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. దీంతో పాటుగా వాణిజ్యం,ఆర్థికాభివృద్ధితోపాటు రక్షణ, భద్రత రంగాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతోపాటు ఎన్‌ఎస్‌జీ, వాసెనార్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకై ఉగ్రవాదం వల్ల అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అస్థిరతపైనా మోదీ, ట్రంప్ చర్చించారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం వచ్చేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, స్థిరత్వం, భద్రతను పరిరక్షించేందుకు భారత్ తీసుకుంటున్న చొరవనూ ట్రంప్ ప్రశంసించారు. భారత ‘థింక్ వెస్ట్’ విధానానికి అనుగుణంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన చర్చలు జరిపి ఆయా దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇటీవల ఉత్తరకొరియా చేపడుతున్న విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు సవాలుగా మారాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉ.కొరియాపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికాకు మద్దతు తెలిపిన భారత్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాలుభారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు దిశగా మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగానే సముద్రనిఘా కోసం 20 మానవరహిత వాయు భద్రత వ్యవస్థ (గార్డియన్ డ్రోన్‌‌స) ను భారత్‌కు అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో భద్రత కోసం ‘వైట్ షిప్పింగ్’డేటాను మార్పిడి చేసుకోవాలని కూడా మోదీ-ట్రంప్ నిర్ణయించారు. దీని ద్వారా సముద్రతీరంలో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుంటుంది. 


భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు అమెరికా పర్యటన తర్వాత జూన్ 27న ఐరోపా దేశం నెదర్లాండ్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత, నీటి సహకారం, సంస్కృతీ సహకారాలకు సంబంధించిన 3 అవగాహనా ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. భారత్‌కు క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం దక్కడంలో మద్దతు ఇచ్చినందుకు నెదర్లాండ్‌‌సకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీ డచ్ కంపెనీల సీఈవోలతో సమావేశమై తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభమైందన్నారు. భారత్‌లో వాణిజ్య ప్రమాణాలు ప్రపంచ దేశాలతో సమానంగా ఉన్నాయన్నారు.


నల్లధనం వెల్లడికి స్విట్జర్లాండ్ ఆమోదంనల్లధనం వివరాల్ని భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని (Automatic Exchange Financial Account) జూన్ 16న స్విట్జర్లాండ్ ఖరారు చేసింది. ఈ ఒప్పందంతో ఎటువంటి వివరాలనైనా భారత్ సులువుగా పొందనుంది. 2018 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకునే అవకాశం ఉంది. దీంతో.. స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. 


భారత్-మయన్మార్ సరిహద్దు పరిశీలనకు కమిటీ భారత్ - మయన్మార్‌ల సరిహద్దు ద్వారా జరుగుతోన్న స్వేచ్ఛాయుత రాకపోకల పరిశీలనకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రీనా మిత్రాను చైర్మన్‌గా నియమించింది. 
మయన్మార్‌తో భారత్‌కు 1,643 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో సరిహద్దు వెంట రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ స్వేచ్ఛాయుత నిబంధనలను కొందరు పౌరులు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత నియమ నిబంధనలను మరోసారి పరిశీలించేందుకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 
ఇదే అంశానికి సంబంధించి 2015లో ఆర్. ఎన్. రవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఇంటలిజెన్స్ కమిటీ.. మయన్మార్ వెంట ఉన్న సరిహద్దు నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం సరిహద్దు వెంట కాకుండా కేవలం కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను అనుమతించాలని పేర్కొంది. 


సియోల్‌లో 5వ భారత్- కొరియా ఆర్థిక సదస్సు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, దక్షిణ కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్-యెన్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలను కొరియా అందించనుంది. 


సోమాలియాతో ఖైదీల బదిలీ ఒప్పందానికి ఆమోదంభారత్, సోమాలియా మధ్య జరిగిన శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ జూన్ 7న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతోపాటు ద్వైపాక్షిక ఆమోదానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.


భారత్ - స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు ఉగ్రవాదంపై పోరాటంతో పాటు వివిధ రంగాల్లో భారత్ - స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మే 31న స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. 
శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.

భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ ఒప్పందం అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్‌‌సడ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్), అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు జూన్ 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్ ప్రకారం లాక్‌హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. టీఏఎస్‌ఎల్ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ-130 జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్ - 92 హెలికాప్టర్‌లకు ఎయిర్‌ఫ్రేమ్ విడిభాగాలు అందజేస్తుంది. 




మే 2017 ద్వైపాక్షిక సంబంధాలు

మారిషస్‌కు 500 మిలియన్ డాలర్ల సాయంమారిషస్‌కు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3,227 కోట్లు) రుణంగా ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మే 27న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు చర్చించారు. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర భద్రతా ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడం ద్వారా వ్యాపారం, టూరిజం, డ్రగ్‌‌స రవాణా, మనుషుల రవాణా, అక్రమంగా చేపలు పట్టడం, సముద్ర వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. 


భారత్ - జర్మనీ మధ్య 12 ఒప్పందాలు ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఈ మేరకు జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో చర్చల సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై మే 30న కీలక చర్చలు జరిపారు. 
అనంతరం రెండు దేశాల మధ్య 12 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సహం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. 
భారత్ ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి జర్మనీ మద్దతు చర్చల్లో అణు సరఫరాదారుల కూటమి(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి జర్మనీ మద్దతు పలికింది. అత్యవసరంగా ఐరాస భద్రతామండలిలో భారీ స్థాయిలో సంస్కరణలు అవసరమని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. అలాగే అలాగే ఇండో జర్మన్ ఎన్విరాన్‌మెంటల్ ఫోరం సమావేశం- 2017ను న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు. 


టర్కీ అధ్యక్షుడి భారత పర్యటనఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భారత్‌కు అన్నివిధాలుగా సహాయమందిస్తామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ టయిప్ ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్ మే 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలతోపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు.


మారిషస్ ప్రధాని భారత పర్యటనమారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ మే 26 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా మే 27న ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మారిషస్‌కు 500 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.3,227 కోట్లు) రుణం ఇవ్వడానికి భారత్ అంగీకరించింది.

ఏడీబీ గ్రూపు 52వ వార్షిక సమావేశంఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) గ్రూపు 52వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రధాని మోదీ మే 22న గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఇది మే 26 వరకు జరిగింది. భారత్‌లో ఈ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఆఫ్రికాలో సంపద సృష్టికి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం ఈ సదస్సు ఉద్దేశం.

శ్రీలంక పర్యటనలో ప్రధాని మోదీభారత్-శ్రీలంక మధ్య బౌద్ధమతానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 11న శ్రీలంక చేరుకున్న ప్రధాని బౌద్ధులకు అత్యంత కీలక పండుగ అయిన అంతర్జాతీయ వేసాక్ దినోత్సవాల్లో పాల్గొననున్నారు. భారత ఆర్థిక సాయంతో శ్రీలంకలో రూ.150 కోట్లతో నిర్మించిన వైద్యశాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.


స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతుశాంతికోసం పాలస్తీనా అనుసరిస్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మే 16న సమావేశమైన మోదీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం సాగిస్తూనే సార్వభౌమాధికారం, స్వాతం త్య్రం కలిగిన ఐక్య పాలస్తీనాను చూడాలని భారత్ ఆకాంక్షిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వీసా మినహాయింపులు, వ్యవసాయ రంగం, ఆరోగ్యం, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.




ఏప్రిల్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్-సైప్రస్ మధ్య నాలుగుఒప్పందాలుఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ హింసను ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని భారత్-సైప్రస్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఏప్రిల్ 28న ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్‌‌స మధ్య ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చ జరిగింది. వైమానిక సేవలు, వాణిజ్య, నౌకాయాన సహకారం సహా 4 అంశాలపై వీరి సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. 


శ్రీలంక ప్రధాని భారత్ పర్యటనలో ఆర్థిక సహకార ఒప్పందం శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే భారత పర్యటనలో ఏప్రిల్ 26న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్, శ్రీలంక మధ్య ఆర్థిక సహకార ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం కొలంబోలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్, ట్రింకోమలీలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుచేస్తారు.

మధ్యదరా సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌ విన్యాసాలు మధ్యదరా సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు జరిగాయి. ‘‘వరుణ్’’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాల్లో భారత్ నుంచి ఐఎన్‌ఎస్ త్రిశూల్, ఐఎన్‌ఎస్ ముంబై అనే యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్ ఆదిత్య అనే నౌకాదళ ఇంధన ట్యాంకర్ పాల్గొన్నాయి.

భారత్-ఇజ్రాయెల్ మధ్య క్షిపణి ఒప్పందం దేశ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు భారత్ ఇజ్రాయెల్‌తో 2 బిలియన్ డాలర్ల క్షిపణి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరా కోసం ఉద్దేశించిన ఒప్పందాలపై ఇరు దేశాలూ ఏప్రిల్ 6న సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఇజ్రాయెల్ ప్రభుత్వ అధీనంలోని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) భారత్‌కు ఎంఆర్‌ఎస్‌ఏఎం శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలను అందజేస్తుంది. మరో సంస్థ రఫేల్ నుంచి కూడా భారత్ రక్షణ సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది.


భారత్- బంగ్లాదేశ్ మధ్య 22 ఒప్పందాలు భారత్, బంగ్లాదేశ్ మధ్య 22 ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఏప్రిల్ 9న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాల సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 
కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారానికి ఒప్పందం. దీనిలో భాగంగా బంగ్లాదేశ్‌కు మిలటరీ హార్డ్‌వేర్‌ను భారత్ సరఫరా చేస్తుంది. 
బంగ్లాదేశ్‌కు లైన్ ఆఫ్ క్రెడిట్ (విడతల వారిగా ఇచ్చే రుణం)లో భాగంగా 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.32 వేల కోట్లు) అందించేందుకూ ఒప్పందం. 
పౌర అణు రంగంలో ఒప్పందం కారణంగా బంగ్లాలో భారత్ అణుకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. 


భారత్, ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, మందులు, క్రీడలు, పర్యావరణం, వాతావరణం, విమానయాన భద్రత, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాల్లో సహకారం కోసం భారత్ - ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్ 10న భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 


హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం భారత్, యూకే ఫండ్
దేశంలో హరిత ఇంధన ప్రాజెక్టుల స్థాపన కోసం భారత్, యూకే 240 మిలియన్ పౌండ్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నాయి. ఢిల్లీలో ఏప్రిల్ 4న జరిగిన భారత్-యూకే 9వ ఆర్థిక, ద్రవ్య చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిధికి భారత్ తన వాటాగా 120 మిలియన్ పౌండ్లను కేటాయించనుంది. ఇది 2015లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు ఉప నిధిగా వ్యవహరిస్తుంది. 

ఆగస్టు 2017 ద్వైపాక్షిక సంబంధాలు

మనీలాలో ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు15వ ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు ఆగస్టు 6న మనీలాలో ముగిసింది. ఇందులో భారత విదేశాంగ సహాయ మంత్రి వి.కె.సింగ్ పాల్గొన్నారు. దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై సదస్సు ఉమ్మడి ప్రకటన చేసింది.

దక్షిణకొరియా ఐవీఐతో భారత్ ఒప్పందం 
టీకా మందులపై పరిశోధన, అభివృద్ధి కోసం దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఐ)తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) డెరైక్టర్ సౌమ్యా స్వామినాథన్, ఐవీఐ డెరెక్టర్ జనరల్ జెరోమ్ హెచ్ కిమ్‌లు ఆగస్టు 21న ఒప్పందంపై సంతకాలు చేశారు. 
భారత్ 2012 నుంచి ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌లో సభ్య దేశంగా ఉంది. టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఈ సంస్థకు ఏటా 5 లక్షల డాలర్ల సహాయాన్ని అందిస్తుంది. ఐవీఐలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 35.


భారత్, నేపాల్ మధ్య ఎనిమిది ఒప్పందాలు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా.. భారత్ పర్యటనలో భాగంగా ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్‌‌స అక్రమ రవాణాను అరికట్టడం, భూకంపాల తర్వాత హిమాలయన్ దేశాల్లో పునర్నిర్మాణం వంటి ఎనిమిది అంశాలపై వీరిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. భారత్-నేపాల్‌ల మధ్య ఉన్న ఓపెన్ సరిహద్దు దుర్వినియోగం కాకుండా ఇరుదేశాల భద్రత, రక్షణ బలగాలు ఒకరినొకరు సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికి దేవ్‌బా స్పందిస్తూ ప్రతి విషయంలోనూ భారత్‌కు సహకారం అందిస్తామని, ఓపెన్ సరిహద్దు ఉన్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగనివ్వమని హామీనిచ్చారు. అనంతరం కటైయా-కుసాహ, రాక్సల్-పర్వానీపూర్ సరిహద్దుల ప్రాంతాల మధ్య విద్యుత్ రవాణా లైన్లను ప్రారంభించారు. 


భారత్, జర్మనీల మధ్య పునరుత్పాదక ఇంధన ఒప్పందం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు సంబంధించిన గ్రిడ్ల నిర్మాణం, అనుసంధానం కోసం భారత్, జర్మనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండో జర్మన్ ఎనర్జీ ప్రోగ్రామ్ - గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ (IGEN-GEC) కార్యక్రమంలో భాగంగా రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. IGEN-GEC ని భారత్, జర్మనీలు 2013లో ప్రారంభించాయి. భారత పునరుత్పాదక ఇంధన నిర్వహణ, హరిత శక్తి కారిడార్ల నిర్మాణం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఇందుకోసం రాయితీతో కూడిన ఒక బిలియన్ యూరోల రుణాన్ని జర్మనీ భారత్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.