Sunday, 11 February 2018

జనవరి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్ - కంబోడియా మధ్య 4 ఒప్పందాలు భారత్-కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషి చేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కంబోడియా ప్రధానమంత్రి హున్‌సేన్‌ల మధ్య జనవరి 27న రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు.

మోదీకి కానుకగా నీటిశుద్ధి యంత్రం భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్-మొబైల్ వాటర్ డీసాలినేషన్ అండ్ ప్యూరిఫికేషన్ జీప్’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా బావ్లా సమీపంలో జనవరి 17న జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్ (భారత్-పాక్ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. సరిహద్దుల్లోని సుయిగామ్‌లో ఇది ఉంటుందని.. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుందని మోదీ పేర్కొన్నారు. 

ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి (ఎంటీసీఆర్), వాసెనార్ గ్రూప్‌లలో స్థానం దక్కించుకున్న భారత్‌కు జనవరి 19న జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లోనూ చోటు దక్కింది.
జీవ, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా.. వీటి తయారీకి అవసరమైన పరికరాలు, ముడిపదార్థాలు, సాంకేతిక వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేసే, సామరస్యపూర్వక ఎగుమతుల నియంత్రణను పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థగా ఆస్ట్రేలియా గ్రూప్ (ఏజీ) పనిచేస్తోంది. అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యాలను చేరుకోవటం, అంతర్జాతీయ భద్రతలో ఈ సభ్యత్వం పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఏజీలో సభ్యత్వం భారత విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. 2016లో ఎంటీసీఆర్‌లో, గతేడాది వాసెనార్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వం పొందింది. 

ఆకర్షణీయ నగరాల జాబితాలోకి మరో తొమ్మిదిఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో కొత్తగా తొమ్మిది నగరాలు చేరాయి. దీంతో వీటి సంఖ్య 99కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, మొరాదాబాద్, సహరన్‌పూర్; తమిళనాడులోని ఈరోడ్; బిహార్‌లోని బిహార్‌షరీఫ్, దాద్రా నగర్ హవేలీలోని సిల్వాసా, లక్షద్వీప్‌లోని కవరత్తి; అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ తదితర నగరాలు తాజా జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ జనవరి 19న ప్రకటన చేశారు.

ఢిల్లీలో భారత్ - ఆసియాన్ సదస్సు జనవరి 25, 26న ఢిల్లీలో భారత్-ఆసియాన్ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా మహాకావ్యం రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్‌‌స, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్-ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. 


భారతీయులను వెనక్కి పంపే ఒప్పందాలపై భారత్-బ్రిటన్ సంతకాలుచట్ట విరుద్ధంగా బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులను వెనక్కి తిప్పి పంపేయడానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై భారత్-బ్రిటన్‌లు లండన్‌లో 2018, జనవరి 13న సంతకాలు చేశాయి. ఉభయ దేశాల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, బ్రిటన్ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి కెరోలిన్‌నోక్స్ సంతకాలు చేశారు. 

భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటన ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జనవరి 14న భారత్ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి. 

తీన్ మూర్తి-హైఫా చౌక్‌గా పేరు మార్పు అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరును అధికారికంగా తీన్ మూర్తి- హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్ మూర్తి మెమోరియల్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు. 
తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్ సర్వీస్ బ్రిగేడ్’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్ విముక్తి కల్పించింది. 
15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరన్ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే.

భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా జనవరి 16న ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక-రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్-ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు. 
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జనవరి 15న ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో జనవరి 15న జరిగిన ఇండియా-ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. 


స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దుఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల కంపెనీ రాఫెల్ అడ్వాన్‌‌స డిఫెన్‌‌స సిస్టమ్స్‌తో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. 1,600 క్షిపణుల కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.3 వేల కోట్లు. ఈ మేరకు ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందిందని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు. 


ఆసియాన్-ఇండియా రౌండ్ టేబుల్ సమావేశంఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న జకర్తాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ అనే రెండు సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆకాంక్షించారు. ఆసియాన్ దేశాలు.. దృఢ, గతిశీల ఆర్థిక బంధాలను కలిగి ఉండాలన్నారు. ఈ దిశగా నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారన్నారు.

ఎవరెస్టు ఎత్తు కొలవాలనే భారత్ ప్రతిపాదన తిరస్కరణనేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. 
2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు. 

 

డిసెంబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

నల్లధనం సమాచార ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ సంతకాలు 

నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌లు డిసెంబర్ 21న సంతకాలు చేశాయి. స్విట్జర్లాండ్ పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన విధానపర ప్రక్రియ ముగియడంతో జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి ఆండ్రియాస్ బామ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆటోమేటిక్ సమాచార మార్పిడి(AEIO) ఉమ్మడి డిక్లరేషన్‌పై రెండు దేశాల మధ్య 2017 నవంబర్ నెలలోనే అవగాహన కుదిరింది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలవుతుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండగా, తమకు అందిన సమాచారం గోప్యతను కాపాడతామని భారత్ స్విస్‌కు హామీ ఇచ్చింది. 


భారత్, చైనా మధ్య ‘సరిహద్దు’ చర్చలు భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు డిసెంబర్ 22న జరిగాయి. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాలేదు. 
భారత్, చైనా మధ్య 2017 జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం 2017 ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటు చేసిన పాక్ అధికారులు.. ఇరువైపులా ఫోన్ ద్వారా (ఇంటర్‌కామ్) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా రికార్డు చేశారు. వీరితోపాటు వచ్చిన భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను జాధవ్‌తో మాట్లాడేందుకు అనుమతించలేదు. 


ఐరాసకు అనుగుణంగానే ‘కశ్మీర్’ పరిష్కారంప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగానూ శాంతి, స్థిరత్వాలను సాధించాలంటే కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తీర్మానాన్ని అనుసరించి భారత్, పాక్‌లు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, అఫ్గానిస్తాన్, పాక్ దేశాల పార్లమెంటు స్పీకర్లు ఇస్లామాబాద్‌లో సమావేశమై ఈ ప్రకటనను వెలువరించారు. తొలుత కశ్మీర్ అంశంపై చర్చించేందుకు రష్యా, ఇరాన్, అఫ్గాన్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆయా దేశాలు తమకు రాజకీయంగా ప్రయోజనాలు చేకూర్చే అంశాలను చర్చల జాబితాలో చేర్చాయనీ, తమకూ కశ్మీర్ అంశమే ముఖ్యమని పాక్ పట్టుబట్టడంతో మిగతాదేశాలూ ఒప్పుకోక తప్పలేదు. 
అలాగే... చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు కలసి తొలిసారిగా డిసెంబర్ 26న బీజింగ్‌లో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ ర్యాంక్ ఆరు స్థానాలు దిగజారి 37కు చేరింది. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) 60 దేశాలకు సంబంధించి డిసెంబర్ 7న విడుదల చేసిన ‘చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2017’ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా (2), హాంకాంగ్ (3), మలేషియా(4), ఆస్ట్రేలియాలు (5) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, ఎనర్జీ ఫైనాన్షియల్ సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతలు.


సింగపూర్‌తో భారత్ రక్షణ ఒప్పందం రక్షణ రంగంలో పరస్పరం మరింత సహకరించుకునేందుకు భారత్ - సింగపూర్ 2017 నవంబర్ 29న ఒప్పందం కుదుర్చు కున్నాయి. ప్రధానంగా నౌకారంగంలో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించు కోనున్నాయి. భారత రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్ మధ్య చర్చలు జరిగాయి. భారత యుద్ధ నౌకలు తమ నౌకా స్థావరాల్లో ఇంధనం నింపుకోవ డా నికి అవకాశం కల్పిస్తామని సింగపూర్ మంత్రి తెలిపారు. దక్షిణ చైనా సముద్రం లో నౌకలు తిరగడానికి స్వేచ్ఛ ఉండాలని ఇరు దేశాలు డిమాండ్ చేశాయి. ఉగ్రవాద అణిచివేత, రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకరించుకోవాలని నిర్ణయించాయి. 

వాసెనార్ బృందంలో భారత్ కు సభ్యత్వంఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (Wassenaar) లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది. ఈ మేరకు డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.
Wassenaar Arrangement on Export Controls for Conventional Arms and Dual-Use Goods and Technologies లేదా Wassenaar Arrangement అనేది ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పనిచేస్తోంది. 


ఢిల్లీలో ఆర్‌ఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వారి స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. ఈ మేరకు డిసెంబర్ 11న ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్‌ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్ (భారత్), వాంగ్ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.


‘చాబహర్’ పోర్టును ప్రారంభించిన ఇరాన్భారత ఆర్థిక సాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలు కలుగుతుంది. ఇరాన్‌లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్‌‌సలో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. చైనా పెట్టుబడులతో పాకిస్తాన్‌లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా దీనిని భారత్ ఇరాన్‌లో నిర్మించింది.




నవంబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతుస్వతంత్ర పాలస్తీనా కోసం ఆ దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’ సందర్భంగా ఐరాసకు ఆయన ఓ సందేశం పంపారు. ఇజ్రాయెల్‌తో పాటు శాంతియుతంగా జీవనం సాగించే స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిర పాలస్తీనా కల త్వరలోనే నిజం అవ్వాలని భారత్ ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 1979 నుంచి ఏటా నవంబర్ 29ని ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’గా నిర్వహిస్తున్నారు.


ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. తద్వారా 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా నవంబర్ 27న రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విసృ్తతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి. 


భారత్‌తో సమాచార మార్పిడికి స్విస్ ఒప్పందం స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంట్ కమిటీ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్ ఆమోదం తెలిపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సూచించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది.

భారత్ - బంగ్లా వీక్లీ ‘బంధన్’ రైలు ప్రారంభం భారత్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడిచే ‘బంధన్’ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు సర్వీసులని ప్రారంభించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయం ఉన్న ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. రూ. 650 కోట్లతో నిర్మించిన బైరట్, టైటాస్ రైల్వే వంతెనలను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు. 


ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన ఇండియా-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్‌‌సలో పర్యటిస్తున్నారు. ఇండియా-ఆసియాన్‌తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. 
ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్‌‌స జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు. 

మనీలాలో ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు ఫిలిప్పీన్‌‌సలోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విసృ్తతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విసృ్తతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు. 



ఆసియాన్ బిజినెస్ ఫోరంతో మోదీ సమావేశం ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. 




ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలుఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూపొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1-3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.