Thursday, 28 June 2018

మే 2018 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్-చైనాల శిఖరాగ్ర సదస్సు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల అనధికార శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ 27న ప్రారంభమైంది. చైనాలోని పర్యాటక కేంద్రమైన వుహాన్‌లో ఇరు దేశాధినేతలు సమావేశమైయ్యారు. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ సదస్సులో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. 


ఇస్లామాబాద్‌లో నిమ్రానా డైలాగ్’ 
భారత్-పాకిస్తాన్‌ల మధ్య అనధికార రాయబార విధానం పునరుద్ధరణకు భారత ప్రతినిధుల బృందం ఏప్రిల్ 28 నుంచి 30 వరకు పాకిస్తాన్‌లో పర్యటించింది. ఇటీవల భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తాజా చర్చలు జరగ్గా, భారత బృందానికి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వివేక్ కట్జూ నేతృత్వం వహించారు. ‘నిమ్రానా డైలాగ్’ గా పిలిచే ఈ అనధికార చర్చలు 1990ల్లోనే మొదలయ్యాయి. రాజస్తాన్‌లో ఉండే నిమ్రానా కోటలో తొలిసారి ఈ చర్చలు జరగడంతో వీటికి ఆ పేరు వచ్చింది.



ఏప్రిల్ 2018 ద్వైపాక్షిక సంబంధాలు

బ్రిటన్-ఇండియా టెక్ అలయన్స్ ఏర్పాటుభారత్, బ్రిటన్‌ల మధ్య టెక్నాలజీ సంబంధాలు పటిష్టం చేసుకునే దిశగా టెక్‌యూకే, దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ బ్రిటన్-ఇండియా టెక్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఏప్రిల్ 18న ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ ఒప్పందంతో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, కొత్త టెక్నాలజీలు పరస్పరం మార్చుకోవడంతో పాటు విధానాల రూపకల్పనలో సహకారం సులభం అవుతుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబయాని ఘోష్ తెలిపారు.


ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన
కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సు కోసం ప్రదాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 18న బ్రిటన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రదాని థెరిసా మేతో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో నేరస్తుల అప్పగింత, న్యాయపరమైన, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, పరస్పర మిలటరీ సహకారంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆన్‌లైన్ ఉగ్రవాదం తదితర అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మోదీ పర్యటన సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్-యూకే వాణిజ్య భాగస్వామ్య పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో బ్రిటన్‌లో భారత్ పెట్టే బిలియన్ పౌండ్ల (రూ.9,340 కోట్లు) పెట్టుబడితో 5,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. 
పర్యటనలో భాగంగా మోదీ లండన్‌లోని సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్ లో ‘భారత్ కీ బాత్.. సబ్ కే సాథ్’ పేరుతో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 1912లో ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ హాల్‌లో మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, బౌద్ధమత గురువు దలైలామా, యువరాణి డయానా వంటి ప్రముఖులు ప్రసంగించారు. 1946లో ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సర్వసభ్య సమావేశం జరిగింది కూడా సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌లోనే.

జర్మనీ ఛాన్సలర్‌తో మోదీ బేటీ
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్‌తో ఏప్రిల్ 20న బెర్లిన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షి, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్
చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఈ సదస్సుకు 8 సభ్యదేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి వాటిని నియంత్రించడంలో అన్ని దేశాలు కలసి పోరాడాలని సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. చైనా చేపట్టిన వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించగా మిగిలిన దేశాలు ఆమోదించాయి.

ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి జర్మనీ మద్దతు అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వం పొందడానికి సహకరిస్తామని జర్మనీ ప్రకటించింది. ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కోసం భారత్ 2016లో దరఖాస్తు చేసుకోగా చైనాతో పాటు మరికొన్ని దేశాలు వ్యతిరేకించాయి. ఈ గ్రూపులో సభ్యత్వం పొందాలంటే భారత్ ఎన్‌పీటీపై సంతకం చేయాలి. భారత్‌తోపాటు ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాలు ఇప్పటి వరకు ఎన్‌పీటీలో సంతకం చేయలేదు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీలో 48 దేశాలకు సభ్యత్వం ఉంది. భారత్‌కు ఇప్పటికే అణ్వస్త్రాల నిరోధానికి ఉద్దేశించిన క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ విధానం (ఎంటీసీఆర్)లో సభ్యత్వం ఉంది.


ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన
ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16న స్వీడన్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్‌తో జరిగిన సమావేశంలో రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం భారత్ - స్వీడన్‌లు సంయుక్తంగా నిర్వహించిన నోర్డిక్ దేశాల(ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, డెన్మార్, నార్వే) సదస్సులో మోదీ మాట్లాడారు. ఏప్రిల్ 19న బ్రిటన్‌లో జరిగే చోగమ్ (కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం)లో మోదీ పాల్గొంటారు. 


నేపాల్ ప్రధానితో మోదీ చర్చలు 
భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 7న ఢిల్లీలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతం, రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చించారు. భారత భూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు. 


భారత్-బంగ్లా మధ్య చమురు పైప్‌లైన్భారత్‌లోని సిలిగురి, బంగ్లాదేశ్‌లోని పార్బతిపూర్ మధ్య 129.5 కిలోమీటర్ల చమురు(డీజిల్) పైప్‌లైన్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు ఏప్రిల్ 9న ఢాకాలో సంతకాలు చేశాయి. దీంతో ఏటా పది లక్షల టన్నుల డీజల్ ఎగుమతికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా మరో ఆరు కీలక ఒప్పందాలపై భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ షాహిదుల్ సంతకాలు చేశారు. వీటిలో ప్రసారభారతి-బంగ్లాదేశ్ బేతార్ మధ్య సహకారం, ఢాకా విశ్వవిద్యాలయంలో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్) ఉర్దూ పీఠం ఏర్పాటు, బంగ్లాదేశ్‌లోని 500 పాఠశాలల్లో భాషాశాలల ఏర్పాటు, రంగ్‌పూర్ నగరంలో రహదారుల అభివృద్ధి తదితరాలు ఉన్నాయి.



మార్చి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

జర్మనీ అధ్యక్షుడితో మోదీ చర్చలు ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్.. మార్చి 25న ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా... వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్‌లు చర్చించారు. అంతకుముందు వాల్టర్.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అనంతరం... మార్చి 25న చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఫ్రాంక్ వాల్టర్.. మార్చి 26న మహాబలిపురం ఆలయాన్ని సందర్శించారు. 

భగత్ సింగ్ డాక్యుమెంట్లను ప్రదర్శించిన పాకిస్తాన్
భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా పాక్ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. మార్చి 26న లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్దగల పంజాబ్ రాష్ట్ర ఆర్కైవ్‌‌స విభాగంలో వీటిని ప్రదర్శించారు. ఇందులో భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, ఆయన చదివిన పుస్తకాలు, జైల్లో ఉన్నప్పుడు వార్తాపత్రికల కోసం భగత్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ భగత్ సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, ఉరి శిక్షను అమలు చేసినట్లు లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో ఉన్న పత్రం, జైలు నుంచి భగత్‌సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్ సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు వంటి వాటిని ప్రదర్శనకు ఉంచారు. భగత్ సింగ్‌ను మార్చి 23, 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. 


ఐరాసలో కశ్మీర్‌పై పాక్ వాదనను ఎండగట్టిన భారత్ 
కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐరాసలో పాక్ చేసిన ఆరోపణలను భారత్ సమర్థవంతంగా ఎండగట్టింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ ఒక ‘విఫల దేశం’అనీ, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాక్ ఆరోపణలకు ఐరాసలో భారత సహాయ కార్యదర్శి మినీదేవి కుమమ్ స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అసలైన మానవహక్కుల ఉల్లంఘన అని అన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన అంటూ పాఠాలు చెప్పే ముందు అక్కడ ఉగ్రవాదానికి ఊతమివ్వటం మానాలనీ.. ముంబై, పఠాన్‌కోట్, ఉదీ దాడులకు కారకులను గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌కు రక్షణ కల్పించిన పాక్‌లో హఫీజ్ సయీద్ వంటి ఎందరో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని ఆమె అన్నారు. ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత సహాయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ..భారత ప్రభుత్వం కశ్మీర్‌ను ఆక్రమించుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 

భారత్-ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు భారత్-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్-ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని విసృ్తతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు మార్చి 10న ఢిల్లీలో ప్రధానిమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 
ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్-ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు. 


జోర్డాన్ రాజు భారత పర్యటన జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్.. భారత పర్యటనలో భాగంగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విసృ్తత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం.. రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, మెడిసిన్, రాక్ ఫాస్పేట్, ఎరువుల దీర్ఘకాలిక సరఫరా, కస్టమ్స్ అంశాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయి.
అంతకముందు ‘ఇస్లామిక్ సంస్కృతి: అవగాహన పెంపొందించుట, సంయమనం’ అంశంపై నిర్వహించిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో కలిసి మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్యలు ఏ మతానికో వ్యతిరేకంగా చేస్తున్నవి కాదని, అమాయకులపై అకృత్యాలకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టేందుకేనని మోదీ పేర్కొన్నారు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకున్నప్పుడే పూర్తిస్థాయి సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.


వియత్నాం అధ్యక్షుడిభారత పర్యటన
వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్.. భారత్ పర్యటనలో భాగంగా మార్చి 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం.. మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు. 

ఫిబ్రవరి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

ప్రధాని మోదీతో కెనడా ప్రధాని ట్రూడో భేటీ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత పర్యటనలో ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, ఇంధన భద్రత, ఉన్నత విద్య, సైన్‌‌స అండ్ ఐటీ, మేధో సంపత్తి హక్కులు, అణు రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ట్రూడో దేశమంతా పర్యటించడాన్ని ఉటంకిస్తూ.. భారత్‌లోని భిన్నత్వం ఈ పర్యటనలో ఆయనకు అర్థమై ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు.

కెనడా ప్రధాని భారత పర్యటన
భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఫిబ్రవరి 23న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు, కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పౌర అణు పరిజ్ఞానం, విద్య, ఐటీ, మేధోహక్కులు, క్రీడలు వంటి అంశాల్లో ఆరు ఒప్పందాలు కుదిరాయి. ప్రధానితో భేటీకి ముందు జస్టిన్ ట్రుడో భార్య, పిల్లలతో కలసి తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం తదితర ప్రదేశాలను సందర్శించారు.

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు విసృ్తత చర్చలు జరిపారు. అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా, సైబర్ నేరాలు తదితరాలను ప్రోత్సహిస్తున్న శక్తులను నిలువరించేందుకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరాన్‌లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహర్ నౌకాశ్రయాన్ని ఆయన స్వర్ణ ద్వారంగా అభివర్ణించారు. రౌహానీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు విషయంలో ఇరాన్, భారత్ ఉమ్మడి వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. భారత్, ఇరాన్‌ల మధ్య రాజకీయ, రాయబారాలకు మించిన చారిత్రక సంబంధం ఉందని రౌహానీ అన్నారు. ప్రాంతీయ సమస్యలను రాజకీయ చర్యలు, రాయబారాలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కలసి తాను కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్ ఎప్పటికీ లోబడి ఉంటుందని రౌహానీ అన్నారు. ఈ ఒప్పందం రద్దయితే అమెరికా చింతించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అనుకూలంగా రౌహానీ మాట్లాడారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు భద్రతా మండలిలో వీటో అధికారాలు ఎందుకు లేవనీ, అణు బాంబులు కలిగిన వారికి కూడా వీటో అధికారాలు ఉన్నాయంటూ ఆయన భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికారు.
9 ఒప్పందాలపై సంతకాలు 
ఉగ్రవాదం, భద్రత, వాణిజ్యం, ఇంధనం తదితరాల అంశాలపై చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 9 ఒప్పందాలు కుదిరాయి. చాబహర్ నౌకాశ్రయంలో కార్యకలాపాలను భారత్ నిర్వహించేందుకు అవసరమైన ఒప్పందం, ద్వంద్వ పన్నులు, పన్నుల ఎగవేతను నివారించడం, రాయబార పాస్‌పోర్టులు కలిగిన వారికి వీసాల నుంచి మినహాయింపునివ్వడం, వైద్యం, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలు వాటిలో ఉన్నాయి. ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ తొమ్మిదింటితోపాటు రౌహానీ పర్యటన సందర్భంగా మరో 4 ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్య కుదిరాయని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.

యూఏఈ పర్యటనలో మోదీ సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మోదీ ఫిబ్రవరి 11న జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రసంగించారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘6 ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5 ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు.
సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057 వరకు 40 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 
అనంతరం దుబాయ్ ఒపెరా హౌజ్‌లో 30 లక్షల భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ అబుదాబిలో నిర్మించతలపెట్టిన తొలి హిందూ దేవాలయం బీఏపీఎస్ నారాయణ్ ఆలయ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా శంకుస్థాపన చేశారు.


అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కి వాటా
ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం(లోయర్ జుకమ్)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు (రూ.3,840 కోట్లు). ఈ మేరకు ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ సమక్షంలో ఫిబ్రవరి 10న ఈ ఒప్పందం కుదిరింది.
చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ఓఎన్‌జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం లోయర్‌జుకమ్ ఆయిల్ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం.


పాలస్తీనా పర్యటనలో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించగా ఆరు ఒప్పందాలు కుదిరాయి. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు.
పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశం మోదీని పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. ఈ పర్యటనతో పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు.


ప్రధాని మోదీ ఒమన్ పర్యటనఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. ఒమన్ పర్యటనలో భాగంగా మోదీ ఫిబ్రవరి 12న ఆ దేశ సుల్తాన్ ఖబూస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై విసృ్తతంగా చర్చించిన మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందంతో పాటు వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం వంటి ఒప్పందాలు ఉన్నాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.


జోర్డాన్ రాజుతో భేటీ అయిన మోదీ
పశ్చిమాసియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 9న జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఆ దేశ రాజు అబ్దుల్లా-2తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో మోదీ పర్యటనరక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునెటైడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుంది. 

సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఆమె ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు.